కాంగ్రెస్తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనంనేని
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:45 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై మాత్రం తమ పార్టీ పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి...
ఇబ్రహీంపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై మాత్రం తమ పార్టీ పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కమ్యూనిస్టులు అర్రులు చాచేది లేదని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ ఆధ్వర్వాన జరిగిన మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పోరాట పంథా వేరు కావొచ్చుగాని మావోయిస్టులది కమ్యూనిస్టుల రక్తమేనని వ్యాఖ్యానించారు. ఎన్నో పార్టీలు వస్తూ పోతుంటాయని, కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఎప్పటికీ ఉంటుందనేది గుర్తెరగాలని చెప్పారు. కొండిగారి రాములు జీవితం ఆదర్శనీయమని ఆయన స్ఫూర్తితో ఇబ్రహీంపట్నంలో పూర్వవైభవం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.