Tragic Love Story: 24 గంటల వ్యవధిలో.. ప్రేమజంట బలవన్మరణం
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:23 AM
ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక.. ప్రియుడు సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలో..
ప్రియురాలు ఉరేసుకోవడంతో..పెట్రోల్ పోసుకుని ప్రియుడి ఆత్మహత్య
యాచారం/హయత్నగర్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక.. ప్రియుడు సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా పరిధిలో.. 24గంటల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ, సిద్ధగోని మహేశ్లు నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, వరుస కుదరదని ఇరు కుటుంబాల పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రేమజంట గతంలోనే రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సోమవారం మహేశ్ పూజకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే చనిపోతానని చెప్పాడు. మహేశ్ చనిపోతే తన వల్లే ఆత్మహత్య చేసుకున్నాడనే నింద పడుతుందన్న ఆందోళనతో పూజ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అందుకు మహేశ్ కారణమంటూ అతని ఇంటి ఎదుట పూజ కుటుంబసభ్యులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ గ్రీన్ఫార్మాసిటీ పోలీసులు మహేశ్పై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రియురాలి మరణంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోనన్న భయంతో మహేశ్ కుటుంబీకులు అతన్ని హయత్నగర్లో బంధువుల నిఘాలో ఉంచారు. అక్కడినుంచి తప్పించుకున్న మహేశ్.. బ్రాహ్మణపల్లి గ్రామశివారులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.