Share News

ప్రజాస్వామాన్ని ఖూనీ చేసేందుకే సర్‌

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:41 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)’ ప్రక్రియను అడ్డుపెట్టుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర..

ప్రజాస్వామాన్ని ఖూనీ చేసేందుకే సర్‌

  • ఓటు, రాజ్యసభ సీటు చోరీకి పాల్పడిన బీజేపీ :మీనాక్షి

  • బీఆర్‌ఎస్‌ పని ఖతం: మహేశ్‌ గౌడ్‌

జోగిపేట, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)’ ప్రక్రియను అడ్డుపెట్టుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారా ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆరోపించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా అందోలు-జోగిపేటలో మంత్రి దామోదర అధ్యక్షతన సర్‌-2026పై కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్‌ చోరీ చేసిన బీజేపీ.. మొన్నటికి మొన్న రాజ్యసభ ఎన్నికల్లో తాను సునాయాసంగా గెలిచే అవకాశముండగా తన నామినేషన్‌ను రద్దు చేయించడం ద్వారా సీట్‌ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. వన్‌ నేషన్‌ - వన్‌ పార్టీ దిశగా దేశ మోదీ-షా ద్వయం పథకాలు రచిస్తున్నారని, అందులో భాగంగానే ‘సర్‌’ ప్రక్రియలో చిత్రవిచిత్ర నిబంధనలు పెట్టారని ఆరోపించారు. గతంలో స్వాతంత్య్ర కోసం పోరాడిన విధంగా ఈసారి సర్‌ ప్రక్రియపై రాహుల్‌, ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పని ఖతమైపోయిందన్నారు. పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ చేసిన అరాచకాలు, అక్రమాలు, నిధుల దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదని పేర్కొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 04:41 AM