Share News

Congress Leaders Criticize: కేటీఆర్‌ వరంగల్‌కు మళ్లీ వస్తే చెప్పులతో కొట్టి పంపిస్తాం

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:48 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సభ్యత లేకుండా మాట్లాడటం సరికాదని విమర్శించారు.

Congress Leaders Criticize: కేటీఆర్‌ వరంగల్‌కు మళ్లీ వస్తే చెప్పులతో కొట్టి పంపిస్తాం

  • ఆయన్ను బ్రోకర్‌, లఫూట్‌ అనలేమా..?

  • రాహుల్‌ గాంధీకి క్షమాపణ చెప్పాలి

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

  • కేటీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు: పొన్నం

  • కేటీఆర్‌.. బట్టలూడదీసి కొడతాం: ఎంపీ అనిల్‌కుమార్‌

  • రేవంత్‌ ఎదుట మాట్లాడే ధైర్యం లేదు: ఆది శ్రీనివాస్‌

వరంగల్‌/హైదరాబాద్‌/రాంనగర్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సభ్యత లేకుండా మాట్లాడటం సరికాదని విమర్శించారు. కేటీఆర్‌ మళ్లీ వరంగల్‌కు వస్తే చెప్పులతో కొట్టి పంపిస్తామని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనగామ బీఆర్‌ఎస్‌ సభలో కేటీఆర్‌.. రాహుల్‌గాంధీని ‘హౌలాగాడు’ అని సంబోధించడం సరికాదని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ కుటుంబం కాళ్లు పట్టుకున్న నీవు.. హౌలా.. అంటూ మాట్లాడుతావా? అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఓ ఐపీఎస్‌ అధికారిని బూతులు తిట్టారని, వాళ్ల బతుకులు అంతేనంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు సిగ్గు, శరం లేదని, ఆయనను బ్రోకర్‌, లఫూట్‌ గాడని తిట్టలేమా? అని అన్నారు. రాహుల్‌గాంధీకి క్షమాపణలు చెప్పే వరకు కేటీఆర్‌ను వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని విమర్శించే తీరు చూస్తే కేటీఆర్‌లో అసహనం పరాకాష్టకు చేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి.. కానీ ఈ విధమైన భాష మంచిది కాదని హితవు పలికారు. రాహుల్‌ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని ఒక ప్రకటనలో కొనియాడారు. రాహుల్‌ గాంధీని ఇలాగే విమర్శించిన పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతార ని ఆయన హెచ్చరించారు. రాహుల్‌గాంధీని విమర్శించే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదని రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌ అన్నారు. సభ్యత లేకుండా మాట్లాడిన కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో గ్రేటర్‌ హైదరాబాద్‌, రాష్ట్రంలో కేటీఆర్‌ను ఎక్కడ తిరగనివ్వబోమని, బట్టలు ఊడదీసి తమ కార్యకర్తలు కొడతారని హెచ్చరించారు. హైదరాబాద్‌ రాంనగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ కేటీఆర్‌కు అహంకారం, నోటి దురుసు తగ్గలేదన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ఎదుట మాట్లాడేందుకు ధైర్యం లేని కేటీఆర్‌.. రోడ్ల వెంట తిరుగుతున్నారని విప్‌ ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడే విషయంలో కేటీఆర్‌ అదుపు తప్పుతున్నారని, స్థాయి, హద్దులు దాటి మాట్లాడటం సరికాదని విమర్శించారు. రాహుల్‌ గాంధీకి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ మానసిక స్థితిపై ఆయన భార్య శైలిమ జాగ్రత్తగా గమనించాలని ఆయన సూచించారు.


కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి

శాసనసభ వ్యవస్థను అగౌరపరిచే విధంగా మాట్లాడుతున్న కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. జనగామలో కేటీఆర్‌ మితిమీరి, మతితప్పి బలుపెక్కి మాట్లాడారని ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. మరోసారి రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డిపై మాట్లాడితే తోడ్కలు తీస్తామని హెచ్చరించారు.

Updated Date - Jan 08 , 2026 | 03:48 AM