వృద్ధుడికి ‘మహాలక్ష్మి’ టికెట్
ABN , Publish Date - May 02 , 2026 | 05:19 AM
ఓ వృద్ధుడి నుంచి రూ.20లు తీసుకుని మహాలక్ష్మి టికెట్ (జీరో టికెట్) ఇచ్చి తనిఖీలో దొరికిపోయిన ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణికులతో కలిసి అధికారులపై చెప్పులతో దాడి చేశాడు.
రూ.20 తీసుకుని టికెట్ ఇచ్చిన కండక్టర్
జరిమానా విధించిన ఆర్టీసీ తనిఖీ అధికారులు
ప్రయాణికులతో కలిసి వారిపై చెప్పులతో దాడి చేసిన కండక్టర్.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్లో ఘటన
రాయికోడ్, మే 1 (ఆంధ్రజ్యోతి): ఓ వృద్ధుడి నుంచి రూ.20లు తీసుకుని మహాలక్ష్మి టికెట్ (జీరో టికెట్) ఇచ్చి తనిఖీలో దొరికిపోయిన ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణికులతో కలిసి అధికారులపై చెప్పులతో దాడి చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద శుక్రవారం జరిగింది. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్కు వస్తుండగా రాయికోడ్ వద్ద తనిఖీ అధికారులు యేసయ్య, ప్రకాశ్లు బస్సును ఆపి తనిఖీ చేశారు. కండక్టర్ వసంత్.. రూ.20లు తీసుకుని ఓ వృద్ధుడికి మహాలక్ష్మి టికెట్ ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో కండక్టర్కు జరిమానా విధించారు. చార్జిమెమోపై సంతకం చేయాలని అధికారులు కండక్టర్ను కోరగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. తన ను అధికారులు తనను లంచం అడుగుతున్నారని, ఉద్యోగం పోతే ఎలా బతకాలంటూ కండక్టర్ ప్రయాణికులను తప్పుదోవ పట్టించి వారితో కలిసి అధికారుల పై చెప్పులతో దాడి చేశాడు. దీంతో ఆర్టీసీ అధికారులకు స్వల్పగాయాలయ్యాయి. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చైతన్య కిరణ్ తెలిపారు.