kumaram bheem asifabad- కో ఆప్షన్ పదవుల కోసం పోటీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:52 PM
జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాల్టీల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ వేడెక్కింది. కొత్త పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత కోఆప్షన్ పదువుల కోసం గత వారం రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగజ్నగర్లో భారీ స్పందన లభించింది. కాగజ్నగర్ మున్సిపాలీటీలో ఇప్పటి వరకు 33 మంది దరఖాస్తులు చేసుకున్నారు. శనివారం దరఖాస్తులకు గడువు ముగియనుండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముంది.
- ఆసిఫాబాద్లో నాలుగు దరఖాస్తులు
- నాయకులపై ఒత్తిడి తెస్తున్న ఆశావహులు
- నేటితో ముగియనున్న గడువు
కాగజ్నగర్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాల్టీల్లో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ వేడెక్కింది. కొత్త పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత కోఆప్షన్ పదువుల కోసం గత వారం రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగజ్నగర్లో భారీ స్పందన లభించింది. కాగజ్నగర్ మున్సిపాలీటీలో ఇప్పటి వరకు 33 మంది దరఖాస్తులు చేసుకున్నారు. శనివారం దరఖాస్తులకు గడువు ముగియనుండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముంది. ఈ నెల 16లోగా ఎన్నిక నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు పూర్త చేస్తున్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో ప్రత్యేక పరిజ్ఙానం, అనుభవం కలిగిన ఇద్దరు(ఒక పురుషుడు, ఒక మహిళ), మైనార్టీ కోటా కింద ఇద్దరు(ఒక పురుషుడు, ఒక మహిళ) ఎంపిక చేయనున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 9, బీజేపీ 5, ఎంఐఎం1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్-బీజేపీ పొత్తుతో మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కాంగ్రెస్ దక్కించుకుంది. ఇప్పుడు కోఆప్షన్ పదవుల పంపకంపై రాజకీయంగా చర్చలు జోరందుకున్నాయి. నాలుగు పదవుల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయన్నది పట్టణంలో హాట్టాపిక్గా మారింది.
- చేతులెత్తే విధానం ద్వారా..
కౌన్సిలర్లు చేతులెత్తే విధానం ద్వారా ఎంపిక జరుగనున్న నేపథ్యంలో, ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై పాలక వర్గంలో అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో కోఆప్షన్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రత్యేక పరిజ్ఙానం కోటాలో మాజీ కౌన్సిలర్లు కూడా బరిలోకి దిగటం విశేషం. మైనార్టీ కోటాలోనూ పోటీ తీవ్రంగానే ఉంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ అభ్యర్థులు తమకు పదవి కేటాయించాలని పార్టీ నాయకులపై ఒత్తి తెస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మైత్రీతో కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకోగా, ఇప్పుడు కోఆప్షన్ ఎంపికపై అందరి దృష్టి పడింది. బీఆర్ఎస్ బరిలో ఉంటుండడంతో రాజకీయం మళ్లీ వేడెక్కింది. కో ఆప్షన్ పదవుల కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. ప్రత్యేక పరిజ్ఙానం, అనుభవం కలిగిన కోటాలో రెండు పదవులు కోసం మాజీ కౌన్సిలర్లు కూడా పోటీ పడుతున్నారు. ఈ రెండు పార్టీల్లోనూ మాజీలు అధికంగా ఉండడం విశేషం. మైనార్టీ కోటాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో తమకు మాట ఇచ్చారని..? తమకు ఖచ్చితంగా ఈ సారి కోఆప్షన్ పదవి ఇవ్వాలని పలువురు పట్టుబడుతున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. కాగజ్నగర్ మున్సిపాల్టీలో హోరాహోరిగా అభ్యర్థులు దరఖాస్తులు చేస్తుండటంతో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. శనివారం చివరి గడువు కావడంతో తమకు చెందిన నాయకులతో ఆశీస్సులు తీసుకొని దరఖాస్తులు చేస్తున్నారు. పక్కాగా ఎవరికి కోఆప్షన్ ఇస్తామన్నది నాయకులు తేల్చక పోవడంతో అభ్యర్థుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో అనూహ్య పొత్తు కాంగ్రెస్, బీజేపీలు చేపట్టగా, ఈ సారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చర్చ జోరందుకుంది. ఇక ఆసిఫాబాద్ మున్సిపాల్టీలో నాలుగు కోఆప్షన్ స్థానాలకు ఇప్పటి వరకు నాలుగు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ మున్సిపాల్టీలో కేవలం నామ మాత్రపు పోటీ ఉన్నట్టు స్పష్టంగా కన్పిస్తోంది.