Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం సోదరుడికి నోటీసులు
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:34 AM
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఫోన్లు ట్యాప్ అయినవారి జాబితాలో ఉన్న దాదాపు 25 మందికి తాజాగా నోటీసులు జారీ చేసింది.
వాంగ్మూలం నమోదు కోసం నేడు హాజరుకావాలని కోరిన అధికారులు!
హైదరాబాద్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఫోన్లు ట్యాప్ అయినవారి జాబితాలో ఉన్న దాదాపు 25 మందికి తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో ముందే సోషల్ మీడియాలో లీకులు రావడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ అధికారులు ఫోన్ చేసి గురువారం విచారణకు హాజరుకావాలని కోరినట్లు తెలుస్తోంది. ‘మీ ఫోన్ ట్యాప్ అయ్యింది. దానికి సంబంధించి మీ వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంద’ని సిట్ అధికారులు కొండల్ రెడ్డితో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావును బుధవారం మధ్యాహ్నం విచారణకు రావాలని వాట్సా్పలో నోటీసులు జారీచేశారు. సమ యం తక్కువగా ఉండటంతోపాటు తాను ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని, విచారణకు హాజరుకాలేనని, కావాలంటే ఇంటికొచ్చి తన వాంగ్మూలం రికార్డు చేసుకోవచ్చునని కొండల్రావు జవాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యల కు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీచేసి గురువారం విచారణకు రావాలని కోరారు. 2024 నవంబరులో వీరిద్దర్నీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీసు అధికారి మేకల తిరుపతన్నతో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడానికి సిట్ అధికారులు అప్పట్లో నోటీసులు జారీ చేశారు. కూకట్పల్లి ఎమ్మె ల్యే కృష్ణారావు కుమారుడు సందీ్పరావు, ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ భాగస్వాములైన నరేందర్, దినేష్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. సందీ్పరావుకు నోటీసు విషయంపై సోషల్ మీడియాలో ముందే లీకులు వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే కృష్ణారావు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసు దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితో మాట్లాడాలని సీపీ సూచించారు. తాను ఏసీపీతో మాట్లాడగా.. నరేంద ర్, దినేష్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చామని, మీ అబ్బాయికి రాలేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఏసీపీ మధ్నాహ్నం 3గంటల సమయంలో వాట్సా్పలో నోటీసు కాపీ పంపారని కృష్ణారావు పేర్కొన్నారు. తన కుమారుడు విదేశాల్లో ఉన్నాడని, ఈ నెల 13 తర్వాత విచారణకు హాజరవుతారని కృష్ణారావు ఏసీపీకి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం సందీ్పరావు, నరేందర్, దినేష్ రెడ్డిలను సిట్ అధికారులు విచారించి వాం గ్మూలాలు నమోదు చేశారు. కొత్తగా సిట్లోకి వచ్చిన అధికారులు పాత వాంగ్మూలాల ను మరోసారి క్రాస్చెక్ చేసుకుంటున్న క్రమంలో గతంలో విచారణకు పిలిచిన వారందర్నీ మరోసారి పిలిచి ముఖాముఖి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును రెండు వారాల పాటు విచారించడం, అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ నవీన్రావును విచారించిన తర్వాత సిట్ అధికారులు రూట్ మార్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫోన్లు ట్యాప్ అయినవారి లిస్టు లో అధికారికంగా, అనధికారికంగా ఉన్నవారిలో నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉన్న తాధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ఉన్నా రు. వీరిలో చాలామంది వాంగ్మూలాలు ఇప్పటికే నమోదు చేసిన నేపథ్యంలో అందర్నీ మరోసారి విచారించాల్సిన అవసరం ఉందా, లేదా అనే అం శంపై సిట్లో సైతం చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
డైలీ సీరియల్లా ట్యాపింగ్ కేసు: రఘునందన్
ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్లా సాగుతోందని, విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ కొండను తవ్వి ఎలుకను పడుతుందో లేదో అని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర నుంచి అవసరమైన డేటాను సిట్ సేకరించవచ్చు కదా? అని ప్రశ్నించారు. సిట్ కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీంలా మారిందని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి బాధితుడిని తానేనని చెప్పారు. ఇవాళ కొండల్ రెడ్డి, రేపు ఆయన డ్రైవర్ ఇలా ఎన్నాళ్లు సాగతీస్తారని ప్రశ్నించారు. కర్త, కర్మ ఒకరి వైపే వేలు చూపిస్తున్నాయని.. ఆయన్ను విచారణకు పిలిచేందుకు భయపడుతున్నారని విమర్శించారు. కవిత పార్టీ పెడితే దేశంలో 6202వ పార్టీ అవుతుందని, ఎవరు కొత్త పార్టీ పెట్టినా బీజేపీ స్వాగతిస్తుందన్నారు. కొంత మంది బీజేపీ నుంచి వలసలుపోవడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. యెన్నం శ్రీనివా్సరెడ్డి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు బీజేపీ నుంచి వెళ్లిన వారే అని, వలస పోయిన నేతలు కూడా ఆలోచన చేయాలని కోరారు.