Share News

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే

ABN , Publish Date - May 03 , 2026 | 05:32 AM

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌లతో సమన్వయం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో...

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే

  • ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

  • వారంలో ఒకరోజు అందుబాటులో ఉంటా

  • ప్రభుత్వ విప్‌లతో భేటీలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌లతో సమన్వయం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒకరోజు విప్‌లకు అందుబాటులో ఉంటానన్నారు. శనివారం ఎంసీహెచ్‌ఆర్డీలో శాసనసభ, శాసనమండలి విప్‌లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలను విప్‌లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను తెలిపారు. దీంతో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఉభయసభల విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, విజయరమణారావు, రాంచందర్‌నాయక్‌, వీరేశం, దయాకర్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2026 | 05:32 AM