CM Revanth Reddy Pledges Historic Developments: మరణానంతరం కూడా గుర్తుంటా
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:49 AM
వన దేవతలు సమ్మక్క- సారలమ్మలకు మొక్కిన మొక్కును తీర్చుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మేడారంలో చేసిన అభివృద్ధి తన మరణం తర్వాత కూడా గుర్తిండిపోయే ఘట్టమని భావోద్వేగంతో అభివర్ణించారు.
గిరిజనులకు చారిత్రక కట్టడాలు అందించిన సంతృప్తి నాది.. మేడారంలో సీఎం రేవంత్
ములుగు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): వన దేవతలు సమ్మక్క- సారలమ్మలకు మొక్కిన మొక్కును తీర్చుకున్నానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మేడారంలో చేసిన అభివృద్ధి తన మరణం తర్వాత కూడా గుర్తిండిపోయే ఘట్టమని భావోద్వేగంతో అభివర్ణించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆదివారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు. ఽ‘ప్రతి మనిషి తన మరణానంతరం ఏమైనా గుర్తింపునిచ్చే పని చేశానా? అని వెనుదిరిగి చూసుకుంటే.. చాలామంది జీవితాల్లో శూన్యం కనిపిస్తుంది.. కానీ నాకు ఏ రోజైనా మరణమంటూ వస్తే పేదలకు, గిరిజనులకు, గిరిజనేతరులకు ఒక అద్భుతమైన చారిత్రక కట్టడాలను అందించాననే సంతృప్తి కలుగుతుంది’ అని తెలిపారు.
సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో పాలన
ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రసత్యం మేడారం మహోత్సవమని సీఎం అన్నారు. గుడిలేని తల్లులను గుండెనిండా కొలుచుకొనే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం అని పేర్కొన్నారు. తమను నమ్మిన ప్రజల కోసం కాకతీయుల మీదనే కత్తిదూసిన వీర వనితలు సమ్మక్క- సారలమ్మలు అని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తితో తెలంగాణలో ప్రజాకంటక పాలనను అంతమొందించాలనే లక్ష్యంతో 2023 ఫిబ్రవరి 6న మేడారం నుంచే ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఎన్నికల్లో గెలుపొంది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆనాడే ప్రతినబూనిట్లు చెప్పారు. మేడారాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తామని నాడే మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం మూడేళ్లు పూర్తికాకముందే మేడారాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా, దక్షిణాదిలో కుంభమేళాగానిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆదివాసీలే కాకుండా గిరిజనేతరులను జాతరకు రప్పించేలా ఒక అద్భుతమైన చారిత్రక కట్టడాలను కట్టాలని సంకల్పించామని చెప్పారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ మహా జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం దైవాపేక్ష అని పేర్కొన్నారు. ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం దేవుడు తనకు, తన సోదరీమణులకు కల్పించినన గొప్ప అవకాశమని అన్నారు. అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలంటే అందరూ ఆశ్చర్యపోయారని.. కానీ జనవరి 26లోపు పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డికి పనులు అప్పగిస్తే ఆయన ఇక్కడే ఉండి నిబద్ధతతో పూర్తి చేయించారని ప్రశంసించారు. ఆర్థిక మంత్రి కూడా అడగ్గానే నిధులు విడుదల చేశారని తెలిపారు. మొత్తం మంత్రివర్గాన్ని మేడారం పిలిపించి సమావేశాన్ని ఏర్పాటు చేసి 2023, ఫిబ్రవరి 6న మొక్కిన మొక్కు చెల్లించుకున్నామని తెలిపారు. ఈ సంతృప్తి జీవితకాలం ఉంటుందని అన్నారు. భక్తులు నిరంతరం ఇక్కడకు వస్తూనే ఉంటారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. రామప్ప, లక్నవరం చెరువుల నుంచి పైపులైన్ ద్వారా జంపన్నవాగులో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. సమ్మక్క, సారలమ్మల పౌరుషం స్ఫూర్తిగా పాలన సాగిస్తామని అన్నారు.
ఆదివాసీ పద్ధతుల్లో పసందైన విందు
మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హరిత హోటల్లో ఆదివాసీల పద్ధతుల్లో అధికారులు పసందైన విందును ఏర్పాటు చేశారు. తేనీటి విందుగా ఇప్ప పువ్వు టీ, కరక్కాయ చాయ్ని ఇచ్చారు. బొంగు చికెన్, నాటుకోడి కూర, మటన్, గోదావరి చేప, గంగ రొయ్యలతో నాన్వెజ్ వెరైటీలను చేయించారు. అదేవిధంగా శాకాహారంలో అడవి చిక్కుడు కూర, ఉలువ చారు, చింతచిగురు వంటకాలను వడ్డించారు. వీటితోపాటు ఇప్పపువ్వు లడ్డూను అందించారు. రుచికరమైన ఆదివాసీ పద్ధతుల్లో చేసిన వంటకాలను సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇష్టంగా ఆరగించారు.