సీఎం ఆన్ డ్యూటీ బోధి పెవిలియన్స్!
ABN , Publish Date - May 18 , 2026 | 02:49 AM
పైన ఫొటోలో కనిపిస్తున్న భవనాన్ని చూశారా.. ఎంత బాగుందో కదా..! ఇది మన రాష్ట్ర అతిథి గృహం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల...
ఎంసీహెచ్ఆర్డీలో పూర్తయిన రాష్ట్ర అతిథి గృహం.. ఇక్కడే సీఎం రేవంత్రెడ్డి సమీక్షలు, సమావేశాలు
పైన ఫొటోలో కనిపిస్తున్న భవనాన్ని చూశారా.. ఎంత బాగుందో కదా..! ఇది మన రాష్ట్ర అతిథి గృహం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో దీన్ని నిర్మించారు. దాదాపు ఎకరంన్నరకు పైగా స్థలంలో గ్రౌండ్ ఫ్లస్ 2 విధానంలో దాదాపు రూ.54.50 కోట్లతో అద్భుతంగా కట్టారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి బస కోసం ప్రత్యేకంగా ఓ అతిథి గృహం ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. గ్రౌండ్ ఫ్లోర్ 6,500 చదరపు అడుగుల్లో ఉండగా.. వీవీఐపీల కోసం చాంబర్, కాన్ఫరెన్స్ రూమ్, సందర్శకుల కోసం ప్రత్యేక గది ఉంది. అంతే విస్తీర్ణంలో ఉండే మొదటి అంతస్తులో 3 బెడ్ రూమ్లు, లివింగ్ ఏరియా, వంటగది, ఓపెన్ పోర్టికో ఉంది. 1,650 చ.అడుగుల్లో నిర్మించిన రెండో అంతస్తులో మల్టీపర్పస్ హాల్ను ఏర్పాటు చేశారు. ఈ భవనం ముందువైపు, పక్కన ఉన్న ఖాళీ స్థలం మొత్తాన్ని గార్డెన్గా అందుబాటులోకి తేవడంతో చుటూ పచ్చని చెట్ల మధ్యన ఆహ్లాదకరంగా ఉంది. ఇటీవలే నిర్మాణం పూర్తయిన ఈ భవనానికి ‘బోధి పెవిలియన్స్’గా నామకరణం చేశారు. ఆ పేరుకు తగ్గట్టుగానే.. గెస్ట్హౌస్ ఎంట్రన్స్లో ఒక చెట్టును ఏర్పాటు చేసి ఆ చెట్టుకింద ‘బుద్ధుడి’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భవనం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖల సమీక్షలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి శనివారం ప్రజాప్రతినిధులతోనూ ఇక్కడే సమావేశమవుతున్నారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఈ కొత్త భవనంలోనే సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
- హైదరాబాద్, ఆంధ్రజ్యోతి