ఆలయాల పునరుద్ధరణతోనే గ్రామీణ పర్యాటకం అభివృద్ధి
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:33 AM
ఆలయాల పునరుద్ధరణతోనే గ్రామీణ ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తద్వారా స్థానిక వనరులు పెరిగి గ్రామాలు ఆర్థిక ....
ఆర్థికంగా పల్లెలు బలోపేతం: సీఎం రేవంత్
రేగొండ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆలయాల పునరుద్ధరణతోనే గ్రామీణ ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తద్వారా స్థానిక వనరులు పెరిగి గ్రామాలు ఆర్థిక పురోగతిని సాధిస్తాయన్నారు. జయశంకర్ - భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోటంచ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసి అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం చుట్టూ తిరిగిన సీఎం రేవంత్.. నూతనంగా చేపట్టిన దేవాలయ నిర్మాణ శైలిని, గోడలను, ఆకృతులను పరిశీలించారు. అటుపై ఆలయ ఆవరణలో రావి మొక్కను నాటి నీళ్లు పోశారు. రూ.12.25 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, రూ.74.15 కోట్లతో చేపట్టనున్న రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతన అతిథి గృహాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కాగా, పలువురు ఏఎన్ఎంలు తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.