Share News

ఎన్‌టీపీసీ విద్యుత్‌ కొనుగోలు చేయండి

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:15 AM

ఎన్‌టీపీసీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర భూగర్భ గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రామగుండంలోని ఎన్‌టీపీసీ రెండో దశలో 800 మెగావాట్ల సామర్థ్యంతో...

ఎన్‌టీపీసీ విద్యుత్‌ కొనుగోలు చేయండి

  • బొగ్గు సమీకరణలో ఎన్‌టీపీసీకి స్వేచ్ఛనివ్వండి

  • తక్కువ ధరకే ఎన్‌టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి

  • సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర భూగర్భ గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రామగుండంలోని ఎన్‌టీపీసీ రెండో దశలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 3 యూనిట్లను త్వరలో పూర్తి చేయనున్నదన్నారు. రెండో దశలోనూ 2400 మెగావాట్ల విద్యుత్‌లో 85ు విద్యుత్‌ను తెలంగాణకు ఎన్‌టీపీసీ సరఫరా చేస్తుందని సీఎం రేవంత్‌కు సోమవారం రాసిన లేఖలో కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా గతవారం 18,139 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైందని, భవిష్యత్తులో మరింత డిమాండ్‌ పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభ ుత్వం కూడా విద్యుత్‌ ఉత్పత్తి వనరుల సమీకరణకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. రెండో దశలో నిర్మించనున్న 4000 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సమీకరణలో రామగుండంలోని ఎన్‌టీపీసీకి తగిన స్వేచ్ఛనివ్వాలని అన్నారు. తద్వారా తక్కువ ధరకే నాణ్యమైన రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను అందించడానికి ఆ సంస్థ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ధరకే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ఎన్‌టీపీసీ నుంచి తక్కువ ధరకే కరంటు కొనుగోలు చేయడానికి ఇతర దక్షిణాది రాష్ట్రాలూ ఒప్పందాలు చేసుకుంటున్నాయని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఎన్‌టీపీసీతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Mar 10 , 2026 | 03:15 AM