సీఎం సభా ప్రాంగణం బురదమయం
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:05 AM
ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లకు వరసగా వర్షం ఆటంకం కలిగిస్తోంది.
మంత్రులు తుమ్మల, పొంగులేటి పరిశీలన
నేడు జగన్నాథపురానికి భట్టి, తుమ్మల
క్షేత్రస్థాయిలో పరిశీలించాకే సభ నిర్వహణపై నిర్ణయం
ఖమ్మం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో తలపెట్టిన రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లకు వరసగా వర్షం ఆటంకం కలిగిస్తోంది. ఆదివారం సాయంత్రం మండలంలో మళ్లీ వర్షం దంచికొట్టింది. దీంతో సభా ప్రాంగణమంతా బురదమయమైంది. టెంట్ల కోసం వేసిన స్తంభాలు పడిపోయాయి. లారీలు, పొక్లెయిన్లు సైతం బురదలో కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆది, సోమవారాల్లో (28, 29 తేదీల్లో) రైతు మేళా పేరిట 150 స్టాళ్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. కానీ శనివారం వర్షం కురవడంతో ఎగ్జిబిషన్ను సోమవారానికి వాయిదా వేశారు. ఆదివారం కూడా భారీ వర్షం పడడంతో ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మంగళవారం సీఎం పాల్గొనాల్సిన రైతు ఆశీర్వాద సభ ఏర్పాటుకు కూడా వర్షం ఆటంకంగా మారింది. ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వేర్వేరుగా సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, తుమ్మల సోమవారం జగన్నాథపురంలో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సభ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోందని, రైతు సంక్షే మం కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు.