Child Mortality: దేశంలో భారీగా తగ్గిన పిల్లల మరణాలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:56 AM
దేశంలో పీడియాట్రిక్స్ అత్యాధునిక వైద్య సేవల కారణంగా పిల్లల మరణాలు భారీగా తగ్గాయని సెంట్రల్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (సీఐఏపీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సింగారవేలు అన్నారు.
సీఐఏపీ జాతీయ అధ్యక్షుడు సింగారవేలు
గన్పార్క్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో పీడియాట్రిక్స్ అత్యాధునిక వైద్య సేవల కారణంగా పిల్లల మరణాలు భారీగా తగ్గాయని సెంట్రల్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (సీఐఏపీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సింగారవేలు అన్నారు. 1995లో 51 శాతం పిల్లల మరణాలుంటే.. 2019 నాటికి 21 శాతానికి తగ్గాయన్నారు. ఆదివారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఓ హోటల్లో జరిగిన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సదస్సుకు సింగారవేలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సమష్టి కృషితో పోలియో వ్యాధి నిర్మూలన నూటికి నూరు శాతం తగ్గిందన్నారు. ప్రస్తుతం భారత్లో ప్లాస్టిక్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేల ప్రకారం వారానికి ఐదు గ్రాముల చొప్పున ప్లాస్టిక్ ప్రతి మనిషి శరీరంలోకి చేరుతోందని.. దీంతో క్యాన్సర్ వ్యాఽధులు సంభవిస్తున్నాయని చెప్పారు. సమూలంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ.. పిల్లలకు పోషకాహారం ఎంతో ముఖ్యమని.. సమయానుసారం వారికి టీకాలను ఇప్పించాలని సూచించారు. ఇండియన్ ఎకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ట్విన్ సిటీస్ బ్రాంచ్కు నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమేశ్ బి దంపూరి, ప్రధాన కార్యదర్శిగా సుచిత్ర, కోశాధికారిగా శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అలాగే 2027 సంవత్సరానికి ఆ బ్రాంచ్ అధ్యక్షురాలిగా టి.ఉషారాణిని ఎన్నుకున్నారు.