kumaram bheem asifabad- సెల్ఫోన్ల చోరీకి చెక్
ABN , Publish Date - Apr 05 , 2026 | 10:36 PM
గతంలో మొబైల్ ఫోన్ పోయిం దంటే బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికి వారు కూడ దానిని రికవరీ చేసే పరిస్థితి లేకపోవడంతో బాధితులు నంబర్ బ్లాక్ చేయడం మినహ ఏం చేసే పరిస్థితి లేకుండేది. మొబైల్ ఫోన్ల దొంగల నుండి బాధితులను రక్షించడానికి పోలీసులు సీఈఐఆర్ వెబ్సైట్ తీసుకురావడంతో మొబైల్ ఫోన్ల దొంగలకు చెక్ పడతున్నట్లయింది.
ఆసిఫాబాద్రూరల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): గతంలో మొబైల్ ఫోన్ పోయిం దంటే బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికి వారు కూడ దానిని రికవరీ చేసే పరిస్థితి లేకపోవడంతో బాధితులు నంబర్ బ్లాక్ చేయడం మినహ ఏం చేసే పరిస్థితి లేకుండేది. మొబైల్ ఫోన్ల దొంగల నుండి బాధితులను రక్షించడానికి పోలీసులు సీఈఐఆర్ వెబ్సైట్ తీసుకురావడంతో మొబైల్ ఫోన్ల దొంగలకు చెక్ పడతున్నట్లయింది. జిల్లాలో వివిధ ప్రాంతాలలో పొగొట్టుకున్న బాధితులకు ఫోన్లను జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాలతో పోలీసులు రికవరీ చేసి అందజేయడంతో వారు అనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ. 18 లక్షల విలువ చేసే..
జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదైన మొబైల్ ఫోన్ల దొంగతనాలను గుర్తించిన పోలీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పక్కన గల మహరాష్ట్ర నుంచిరూ. 18 లక్షల విలువ చేసే 164 ఫోన్లను బాధితులకు అందజేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఫోన్ల రికవరీ చేయడంతో జిల్లాలోని ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పొగొట్టుకున్న వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఈఐ ఆర్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఐఎంఈఐ నెంబర్లతో నమోదు చేయాలి. ఆ అప్లికేషన్ పోలీసు స్టేషన్ పరిధికి వెళ్లడంతో పోలీసులు మొబైల్ ఫోన్ వెతికే పనిలో ఉంటారు. కాగా మార్కెట్లో దుకాణాలలో సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు దుకాణదారుని నుండి రసీదు తీసుకొవాలని సూచిస్తున్నారు. ఎవరైనా దొంగ ఫోన్ దొంగలించి దుకాణంలో విక్రయిస్తే దానిని కొనుగోలు చేసిన వినియోగదారుల వద్ద నుంచి దానిని పోలీసులు రికవరీ చేస్తారు. దీని నుంచి తప్పించుకొవాలంటే రసీదు తీసుకొవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
మొబైల్ పోతే వెబ్సైట్లో నమోదు చేయాలి..
- నితికా పంత్, ఆసిఫాబాద్ ఎస్పీ
ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పొగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్లో నమోదు చేయాలి. దానిలో అడిగిన పూర్తి వివరాలను నమోదు చేసిన తర్వాత స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేయడం జరుగుతుంది. సెకండ్హ్యండ్ ఫోన్ కొనుగోలు చేసేవారు జాగ్రత్తగా ఉండి దుకాణ దారుడి నుంచి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి.