Share News

తుంగభద్ర కమిటీపై కదలిక

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:10 AM

తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నావలి రిజర్వాయర్‌, రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) ఆధునీకరణపై మూడు రాష్ట్రాలతో ..

తుంగభద్ర  కమిటీపై కదలిక

  • 3 రాష్ట్రాల అధికారులతో ‘జలశక్తి’ సమావేశం

  • సత్వరమే కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నావలి రిజర్వాయర్‌, రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌(ఆర్డీఎస్‌) ఆధునీకరణపై మూడు రాష్ట్రాలతో కమిటీ వేయడానికి వీలుగా కేంద్ర జలశక్తి శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా దీనిపై కర్ణాటక, ఏపీ, తెలంగాణ నీటిపారుదల/జలవనరుల శాఖ కార్యదర్శులు/ముఖ్యకార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కేఎల్‌ కాంతారావు సమావేశమయ్యారు. ఇటీవలే తుంగభద్ర జలాశయం 33 గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నావలి రిజర్వాయర్‌, ఆర్డీఎ్‌సపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమావేశం కావడమే కాకుండా... ఒక కమిటీ వేసి, అధ్యయనం అనంతరం నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించిన విషయం విదితమే. దాంతో కమిటీ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు. కాగా, ఆర్డీఎస్‌ ఆధునీకరణకు కావాల్సిన నిధులను తెలంగాణ చెల్లించాల్సి ఉంది. ఆర్డీఎ్‌సను పూర్తిస్థాయిలో మూడు రాష్ట్రాలు సంయుక్తంగా కలిసి, ఆధునీకరించే దిశగా చర్యలపై అధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - Jul 05 , 2026 | 05:10 AM