దేశీయ తయారీ రంగానికి ఊతం
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:12 AM
వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్ర జ్యోతి): వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు అన్నారు. ఈ బడ్జెట్ వికసిత్ భారత్ నిర్మాణ ఆశయంగా మాత్రమే కాకుండా వాస్తవంగా మారే దిశగా దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్కు హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రకటనతో రాష్ట్రం జాతీయ వృద్ధి యంత్రంగా మరింత బలపడుతుందని తెలిపారు. ఇది మార్పును తీసుకొచ్చే బడ్జెట్ అని, ఆర్థిక బలం నుంచి జాతీయ సామర్ధ్యానికి, అంత్యోదయం నుంచి అభ్యుదయానికి దేశాన్ని నడిపించే స్వర్ణయాత్రకు ఈ బడ్జెట్ బాటలు వేస్తుందన్నారు. దేశీయ తయారీ రంగానికి ఊతమివ్వడంతోపాటు ఇంధన భద్రతను బలోపేతం చేస్తుందని, దిగుమతులపై ఆధారపడే విధానంలో మార్పు వస్తుందని వివరించారు. ఉపాధి సృష్టి, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, కొనుగోలు శక్తి వృద్ధి, నాణ్యమైన విద్య, వైద్య సేవల విస్తరణకు బడ్జెట్ బలమైన పునాది వేస్తుందన్నారు. ప్రధాని మోదీకి, నిర్మలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.