తెలంగాణకు శాశ్వత ద్రోహి కాంగ్రెస్
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:46 AM
తెలంగాణకు శాశ్వత ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి...
పాలమూరు వెళ్లేందుకు సీఎంకు రెండున్నర ఏళ్లు పట్టిందా?
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్ర జ్యోతి): తెలంగాణకు శాశ్వత ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. పాలమూరు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డికి రెండున్నర ఏళ్లు పట్టిందా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను అవమానించేలా మాట్లాడి గోప్పొడు కావాలని రేవంత్ భావిస్తున్నాడన్నారు. చంద్రబాబు వద్ద సీఎ్సగా చేసిన వ్యక్తిని తెలంగాణ ఇరిగేషన్కు సలహాదారుగా పెట్టారని, చంద్రబాబు చెప్పినట్లు పరిపాలన చేయడానికే ప్రజలు అధికారం ఇచ్చారా అని ఆయన రేవంత్ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ తన సహచర మంత్రులను దెప్పి పొడుస్తున్నారని, ప్రజాభవన్లో కూర్చుని డిప్యూటీ సీఎం భట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. గోచీ పెట్టుకున్న వారంతా వైఎస్ కాలేరని రేవంత్ అన్నారని ఆరోపించారు. ఎస్సీలు పంచె కట్టుకోవద్దా.. డిప్యూటీ సీఎం కావద్దా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్లనే పాలమూరు ఎడారిగా మారిందని ఎక్కడ చర్చ చేద్దామో రేవంత్ సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. చంద్రబాబు ఆలోచనలు రేవంత్ రూపంలో తెలంగాణలో అమలవుతున్నాయని, ఆదిత్యనాథ్ దాస్ను వెంటనే టెర్మినేట్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ విసురుతున్న రాళ్లను భద్రంగా దాస్తున్నామని, భవిష్యత్తులో వాటిని ఉపయోగిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. మోసాలు, అబద్దాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ రూ.4 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఏం చేశారని అప్పులు తెచ్చారో చెప్పాలన్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయమన్నారు.