కుక్కల దాడిలో గాయపడిన బాలుడికి కంటి ఆపరేషన్ పూర్తి
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:09 AM
యాదాద్రి భువనగిరి పట్టణం తారకరామనగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రియాంశ్కు హైదరాబాద్ ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో శుక్రవారం శస్త్రచికిత్స పూర్తయింది.
కోలుకున్న అనంతరం కృత్రిమ కన్ను అమర్చే అవకాశం
వైద్యం ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే: ఎంపీ చామల
యాదాద్రి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి పట్టణం తారకరామనగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రియాంశ్కు హైదరాబాద్ ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో శుక్రవారం శస్త్రచికిత్స పూర్తయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కుక్కల దాడిలో కుడి కనుగుడ్డు పూర్తిగా బయటకు రావడంతో చిన్నారికి శస్త్రచికిత్స అనివార్యమైంది. అయితే, ఆ కంటికి చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాలుడు పూర్తిగా కోలుకున్న తర్వాత కృత్రిమ కన్ను అమర్చనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనపై భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి స్పందించారు. కలెక్టర్ అనురాగ్ జయంతితో ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడి బాలుడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి శుక్రవారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి అండ గా ఉంటామని, మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.