ఫోన్కన్నా పుస్తకమే మిన్న : అడ్లూరి
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:56 AM
సెల్ఫోన్ కంటే పుస్తకమే ఎక్కువ శక్తిని ఇస్తుందని, సోషల్ మీడియా పైన కాకుండా లక్ష్యాల సాధనపైనే సమయం ఎక్కువగా వెచ్చించాలని...
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): సెల్ఫోన్ కంటే పుస్తకమే ఎక్కువ శక్తిని ఇస్తుందని, సోషల్ మీడియా పైన కాకుండా లక్ష్యాల సాధనపైనే సమయం ఎక్కువగా వెచ్చించాలని విద్యార్థులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సూచించారు. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన కిట్ల పంపిణీ కార్యక్రమంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. విద్యార్థుల కృషి, సంకల్పమే వారి భవిష్యత్తును నిర్ణయిస్తుందే తప్ప వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కాదన్నారు. ప్రస్తుతం గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులే రేపటి ఐఏఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు కావాలన్నారు. ఒక విద్యార్థిపై పెట్టిన ప్రతి రూపాయి రాష్ట్ర భవిష్యత్తుపై పెట్టిన పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. గురుకుల విద్యార్థులే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. తమ లక్ష్యం కేవలం ఉద్యోగాలు పొందే విద్యార్థులను తయారు చేయడం కాదని, సమాజానికి మార్గదర్శకులయ్యే నాయకులను, దేశాభివృద్ధికి తోడ్పడే పౌరులను తీర్చిదిద్దడమేనన్నారు.