అనవసరంగా విపక్షాలతో కలిశాం
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:32 AM
మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా బీజేపీలో జరిగిన ఘటనలు అంతర్గత చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని నిన్నటిదాకా విమర్శలు చేశాం
చైర్మన్ ఎన్నికల్లో వారికే మద్దతిస్తే ఎలా
ఈ పరిణామంతో ఇబ్బందికర పరిస్థితి
తెలంగాణ బీజేపీ నేతల్లో అంతర్గత చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా బీజేపీలో జరిగిన ఘటనలు అంతర్గత చర్చకు దారితీశాయి. కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మునిసిపాలిటీలో అనుసరించిన వైఖరిలాగా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు మద్దతు ఇవ్వకుండా ఉంటే సమీకరణాలు మరోలా ఉండేవన్న వాదన తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అంటూ నిన్నటిదాకా విమర్శనాస్త్రాలు సంధించిన తమకు, తాజా ఘటనలతో ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని కొంత మంది పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. అయితే, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే మరో అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ‘‘ఏ పార్టీకి మనం వ్యతిరేకమో అదే పార్టీకి మద్దతివ్వడం సరికాదు.’’ అని దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడొకరు స్పష్టం చేశారు. ‘‘కొన్ని మునిసిపాలిటీల్లో పార్టీ స్థానిక నేతలు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడంతో ఆయా కేంద్రాల్లో కాంగ్రెస్, బీఆర్ఎ్సలకు బీజేపీ జీవం పోసినట్లయింది.’’ అని పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్ ముక్త్ భారత్ కోసం కమలదళం ప్రయత్నం చేస్తోంది. . దేశమంతా ఒకలా ఉంటే, రాష్ట్రంలో మరోలా కొనసాగింది. ఈ పరిణామం ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. మరోవైపు, బీఆర్ఎ్సకు మద్దతు ఇవ్వాలని జాతీయ నాయకత్వం ఎన్నడూ చెప్పలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముఖ్యనాయకులు కాంగ్రె్సకు మద్దతిస్తే, మరికొందరు బీఆర్ఎ్సకు అండగా నిలిచారు. ఇది సమర్థనీయం కాదు’’ అని పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు. ‘‘ కాంగ్రెస్, బీఆర్ఎ్సలకు సమాన దూరంలో ఉండాలి. ఇది పార్టీ జాతీయ నాయకత్వం సందేశం. ఇందుకు భిన్నంగా పలు చోట్ల స్థానిక పార్టీ నాయకులు వ్యవహరించడం విడ్డూరం. నారాయణపేట మునిసిపాలిటీ, కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే ఏ పార్టీ మద్దతు తీసుకోకుండా గెలిచాం.
కొన్ని మునిసిపాలిటీల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి వైస్ ఛైర్మన్ పదవులు తీసుకోవడం సమర్థనీయం కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ జగిత్యాలలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే కచ్చితంగా ఛైర్మన్ పదవి మాకు దక్కేది. కానీ, బీఆర్ఎస్ మాజీ నేత ఒకరు సూచించిన అభ్యర్థులకు పలు చోట్ల టికెట్లు ఇచ్చారు. అందుకే చేదు ఫలితం దక్కింది’’ అని పలువురు జగిత్యాల జిల్లా నేతలు రాష్ట్ర పార్టీకి నివేదించారు. కాగా, మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఇద్దరు ఎంపీలు, మరో ఎమ్మెల్యే అనుసరించిన వైఖరిపై స్థానిక పార్టీ కార్యకర్తలు రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేశారు. దీంతో, ఆ ఫిర్యాదుకు అనుగుణంగా జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.