సంస్థాగతంగా పార్టీ బలోపేతం
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:59 AM
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతోందని, జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను...
అంకిత భావంతో పనిచేసే నేతలకు ప్రాధాన్యం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో రాంచందర్ రావు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతోందని, జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను కలిసి వివరించారు. దీనదయాళ్ పేరిట విస్తృత స్థాయిలో చేపట్టిన శిక్షణ తరగతుల గురించి వివరించినప్పుడు పార్టీ నేతలు ఆయన్ను ప్రశంసించారు. సీనియర్ నేతల్లో అంకిత భావంతో పనిచేస్తున్న వారిని కమిటీల్లో నియమించి పార్టీని క్రియాశీలంగా మార్చినట్లు ఆయన వివరించారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ పనితీరును సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. త్వరలో ఓటర్ల జాబితా విస్తృత సవరణ జరుగుతున్నందువల్ల ఈ సవరణకు సంబంధించి పార్టీ నేతలకు పూర్తి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టనున్న నారీ శక్తి వందన అధినియమ్పై మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించేందుకు కార్యక్రమాలను రూపొందించాలని నబీన్ సూచించారు. సమావేశంలో బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో రాజకీయాలు ఏమీ చర్చించలేదని రాంచందర్ రావు తెలిపారు.