దేశాన్ని ముక్కలు చేసేందుకు కుట్రలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:32 AM
దేశాన్ని ముక్కలు చేసేందుకు కొన్ని విశ్వవిద్యాలయాల్లో కుట్రలు జరుగుతున్నాయని, దేశ ఐక్యతను బలహీన పరిచేందుకు శక్తులు పని చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆరోపించారు.
యువతపైనే అత్యంత పెద్ద బాధ్యత
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని ముక్కలు చేసేందుకు కొన్ని విశ్వవిద్యాలయాల్లో కుట్రలు జరుగుతున్నాయని, దేశ ఐక్యతను బలహీన పరిచేందుకు శక్తులు పని చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆరోపించారు.తుపాకులు పట్టుకుని, బాంబులు వేసి, ఉగ్రవాదంతో సమాజాన్ని మార్చలేరని, ప్రజాస్వామ్య మార్గంలోనే భారత్లో రాజ్యాధికారం మారాలని స్పష్టం చేశారు. కనుక భారతదేశ యువతపై అత్యంత పెద్ద బాధ్యత ఉందని, దేశం గురించి ఆలోచించేలా ముందుకు వెళ్లాలని యువకులకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన నూతన ఓటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు దాటగానే ఓటు హక్కు వస్తుందని, ఓటేస్తేనే ప్రశ్నించే అధికారం వస్తుందని పేర్కొన్నారు. ‘బుల్లెట్ కన్నా బ్యాలెట్ శక్తిమంతమైంది’ అనే మాట ప్రజాస్వామ్యానికి గల బలాన్ని తెలియజేస్తుందన్నారు. ఓటుతోనే రాజ్యాధికారాన్ని మార్చగలమని చెప్పారు. మేధావులమని చెప్పుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రభుత్వాలను విమర్శించే కొందరు ఓటేయడానికి రారని ఆయన విమర్శించారు.