పేదల ఇళ్ల కూల్చివేత క్రూరమైన చర్య
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:50 AM
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పరామర్శ
ఖమ్మం క్రైం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదివారం ఆయన పరామర్శించి, ధ్వంసమైన ఇళ్లను పరిశీలించారు. అనంతరం రాంచందర్రావు మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేయడానికే ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేసిందని ఆరోపించారు. వెలుగుమట్ల భూదాన్ భూములపై ‘యథాతథ స్థితి’ కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించినా, ప్రభుత్వం వాటిని ఖాతరు చేయకుండా, యంత్రాలతో ఇళ్లను కూల్చివేసిందని ధ్వజమెత్తారు. 15ఏళ్లుగా సుమారు 600 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయని, రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేదల పొట్ట కొట్టడం క్రూరమైన చర్య అని ధ్వజమెత్తారు. బాధితులందరికీ కూల్చిన చోటే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.