‘రైతు భరోసా’పై మోసగించిన కాంగ్రెస్
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:09 AM
రైతుభరోసా నిధుల విడుదల చేసే విషయమై రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
సీఎం రేవంత్కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా నిధుల విడుదల చేసే విషయమై రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి.. మభ్య పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు. యాసంగి సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. రైతు భరోసాపై సర్కారు రేపు, మాపు అంటూ కాల యాపన చేస్తోందని మండిపడ్డారు. మునిసిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ఈ నెల 4న మిర్యాలగూడలో సీఎం రేవంత్ ప్రకటించారని గుర్తు చేశారు. ‘మీరిచ్చిన మాటను మీరే విస్మరిస్తే ఎలా? రైతుభరోసా నిధుల కోసం రాష్ట్రంలోని 67 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. తక్షణం రెండు విడతల రైతుభరోసా నిధులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతీ రైతుకీ ఎకరాకు రూ. 15వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాల్సిందే అని సంజయ్ స్పష్టం చేశారు.