ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: రాంచందర్ రావు
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:31 AM
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్థంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు...
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్థంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాతీర్పును అగౌరవపరిచేలా ఉందని ఆరోపించారు. ఓ వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, 6 నెలల లోపు మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్సభకు పోటీ చేయడం మొత్తం రాష్ట్ర ప్రజలు చూసిన విషయమేనని గుర్తుచేశారు. విషయం ఇంత స్పష్టంగా ఉన్నా దానిని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని స్పీకర్ చెప్పడం ఆశ్చర్యకరమని.. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే తీర్పు అని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా స్పీకర్ అగౌరవపరిచినట్లేనని.. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.