కాంగ్రెస్ చర్య దుర్మార్గం
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:38 AM
కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా : బండి సంజయ్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చర్య అత్యంత దుర్మార్గమని రాంచందర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాదనలకు రాళ్లు, దాడులతో సమాధానం ఇవ్వడమేనా మీ ప్రజాపాలన..? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా..? అని నిలదీశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. ఎంపీ ఈటల రాజేందర్, తన నివాసం నుంచి కామారెడ్డికి బయలుదేరగా ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కామారెడ్డికి బయలుదేరిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండించారు.