Disqualification Case: ఎమ్మెల్యే దానం ‘అనర్హత’పై సుప్రీంకు బీజేపీ
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:39 AM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
స్పీకర్ ప్రసాద్కుమార్పై కోర్టు ధిక్కరణ పిటిషన్
దాఖలు చేసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్/న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా.. స్పీకర్ పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దానం బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసినా.. ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేయలేదని తెలిపారు. దానం నాగేందర్ కనీసం తన వివరణ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆయన పార్టీ ఫిరాయింపునకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని, అయినా స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడం తీవ్ర పరిణామమని తెలిపారు.