డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే లక్ష్యం
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:56 AM
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తామన్నారు...
బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో రాంచందర్రావు
హైదరాబాద్, మార్చి6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎ్సను రాష్ట్ర ప్రజలు మరచిపోయారని అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాంచందర్రావు మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలే బలగంగా బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి వంటి మహనీయులు వేసిన పునాదులపై పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పార్టీ కేడర్కు విజ్ణప్తి చేశారు. కాగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఫోన్లో రాంచందర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, శాసనమండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.
బీజేపీలోకి సినీనటి పూజిత
సినీనటి పూజితతో పాటు పలువురు సినీ, టీవీ కళాకారులు బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు వారికి కాషాయ కండువా వేసి ఆహ్వానించారు.