కాంగ్రెస్ అభ్యర్థి మద్దతుదారులతో ప్రాణహాని
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:24 AM
భువనగిరిలోని ఒకటో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మద్దతుదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆ వార్డు ప్రజలు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు..
భువనగిరిలో పోలీసులను ఆశ్రయించిన 1వ వార్డు ఓటర్లు
భువనగిరి టౌన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): భువనగిరిలోని ఒకటో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మద్దతుదారుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆ వార్డు ప్రజలు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి భువనేశ్వరి స్వల్ప మెజార్టీతో విజయం సాధించగా.. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పలబోజు స్వరూపారాణి, మరో స్వతంత్ర అభ్యర్థి అనుచరుల తీరు వివాదానికి దారితీసింది. శనివారం రాత్రి ఓటర్ల ఇళ్లపై బీరు సీసాలతో దాడులు చేసి బెదిరింపులకు దిగారు. తాము పంపిణీ చేసిన చీరలు, మద్యం, నగదు, రైస్ కుక్కర్లు తిరిగి ఇవ్వాలంటూ హెచ్చరించారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓటర్లు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అభ్యర్థులు ఇచ్చిన సామగ్రిని కుప్పగా పోసి, వాటిని తీసుకు వెళ్లాలంటూ నిరసన తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.