‘భోలు’ను అడగండి..రైల్వే సమాచారం పొందండి!
ABN , Publish Date - May 02 , 2026 | 05:37 AM
బెంగళూరు నుంచి వచ్చే వందేభారత్ ఏ ప్లాట్ఫారంపై ఉంది. లింగంపల్లి వెళ్లే ఎంఎంఎటీఎస్ ఎంతసేపట్లో వస్తుంది..’.
ప్రధాన రైల్వేస్టేషన్లలో ఏఐ ఆధారిత కియోస్క్లు
24 గంటలూ అందుబాటులో..రైళ్ల రాకపోకలు, ప్లాట్ఫామ్ల సమాచారం
హైదరాబాద్ సిటీ, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘బెంగళూరు నుంచి వచ్చే వందేభారత్ ఏ ప్లాట్ఫారంపై ఉంది. లింగంపల్లి వెళ్లే ఎంఎంఎటీఎస్ ఎంతసేపట్లో వస్తుంది..’.. రైల్వేస్టేషన్లలో విచారణ కౌంటర్ల వద్ద ఇలా వివరాలు ఆరా తీసే ప్రయాణికులు ఎందరో. అసలే గుమిగూడిన ప్రయాణికులు, పెద్దగా ధ్వనుల మధ్య ఎవరేం అడుగుతున్నారో అర్థంకాని పరిస్థితి. కానీ ఇకపై ఈ ఇబ్బంది తప్పనుంది. ‘భోలు’ దగ్గరికి వెళ్లి హలో అంటూ అడిగితే చాలు. రైళ్ల రాకపోకలు, ప్లాట్ఫారాలు, స్టేషన్లోని సౌకర్యాలు సహా మీకు కావాల్సిన సమాచారం క్షణాల్లో చెప్పేస్తుంది. ఎవరా ‘భోలు’ అంటారా.. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే కియోస్క్. ప్రధాన రైల్వేస్టేషన్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్లోని మల్కాజిగిరి రైల్వేస్టేషన్లో భోలు మినీ, కాచిగూడ స్టేషన్లో భోలు మ్యాక్స్ కియో్స్కలను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ భాషల్లో మాట్లాడితే స్పందించి తగిన వివరాలు అందిస్తాయి. భోలు మ్యాక్స్ అయితే 12 భారతీయ భాషల్లో సమాధానం ఇస్తుంది. శుక్రవారం రైల్ నిలయంలో ఈ కియోస్క్ల పనితీరును దక్షిణమధ్యరైల్వే జీఎం శ్రీవాస్తవ, ఇతర అధికారులు పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రయాణికులకు సంతృప్తికరమైన, మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని శ్రీవాస్తవ చెప్పారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఈ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని.. తర్వాత జోన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.