భక్తజన సంద్రమైన భీమన్న ఆలయం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:15 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిది, భీమేశ్వర స్వామి ఆలయం భక్తజనంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వేములవాడకు తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా
వేములవాడ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిది, భీమేశ్వర స్వామి ఆలయం భక్తజనంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వేములవాడకు తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్న భక్తులు పవిత్రస్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో శీఘ్రదర్శనం, బ్రేక్దర్శనం టికెట్స్ కోసం పోటీపడ్డారు. ఆయా క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరించారు. వేములవాడ భీమేశ్వర స్వామి వారి ఆలయంలోని పలు విభాగాలను ఇన్చార్జి ఈవో అంజనారెడ్డి తనిఖీ చేశారు. భీమన్న ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లడ్డూల తయారీ కేంద్రాన్ని పరిశీలించి లడ్డు నాణ్యత, బరువును పరిశీలించారు. తిప్పాపూర్ గోశాలలోని కోడెల పరిస్థితిని పరిశీలించారు.
నేడు కోడెల పంపిణీ
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించే నిజకోడెలను మంగళవారం పంపిణీ చేయనున్నట్లు ఇన్చార్జి ఈవో అంజనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తిప్పాపూర్ గోశాలలోని కోడెల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. అంతే కాకుండా కోడెలకు అందుతున్న దాణాపై ఆరా తీశారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితి, సంరక్షణ విధానం గురించి వెటర్నరీ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.