Share News

సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:21 AM

సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ...

సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు

  • రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిని వాడుకోవద్దు

  • బొగ్గు ఉత్పత్తి, నిల్వలో పారదర్శకత: డిప్యూటీ సీఎం భట్టి

మంచిర్యాల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న భట్టి ఆదివారం శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఓపెన్‌ హౌస్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించారు. ఓసీపీ పరిసరాలను పరిశీలించి, అక్కడ అమలవుతున్న భద్రతా ప్రమాణాలు, బొగ్గు రవాణాకు సంబంధించిన లెక్కలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి, నిల్వ, రవాణా ప్రక్రియలో సింగరేణి పూర్తి పారదర్శకతను పాటిస్తోందన్నారు. అంతకుముందు మంచిర్యాలలో పర్యటించిన భట్టి.. పట్టణ ప్రగతిపై ప్రశంసలు కురిపించారు. మంచిర్యాల చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ మంచిర్యాలలో రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉన్నాయన్నారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఓటర్లను తొలగించడం ద్వారా మరో సారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Updated Date - Jun 15 , 2026 | 04:21 AM