Electricity Scheme: గృహ జ్యోతి లబ్ధిదారులకు భట్టి లేఖ..
ABN , Publish Date - Jan 12 , 2026 | 04:22 AM
రాష్ట్రంలోని 83 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు.
83 లక్షల మందికి పథకం తీరుపై సందేశాలు
ఇంటింటికీ లేఖలు అందిస్తున్న విద్యుత్ సిబ్బంది
హైదరాబాద్ సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 83 లక్షల మంది గృహ జ్యోతి లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు. వాటిని విద్యుత్ అధికారులు స్వయంగా వెళ్లి వినియోగదారులకు అందజేస్తున్నారు. భట్టి ఆదేశాల మేరకు.. వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆదివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వినియోగదారుడి పేరు, సర్వీస్ నంబర్లతో ఈ లేఖలు ముద్రించారు. ‘‘మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా గృహ జ్యోతిపథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇప్పుడు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 52,82,498 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది’’ అని భట్టి లేఖలో పేర్కొన్నారు.