కుల గణనతోనే సామాజిక న్యాయం: భట్టి
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:59 AM
జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన జరగాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. సమగ్ర కులగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ...
హైదరాబాద్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన జరగాల్సిందేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. సమగ్ర కులగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్కుమార్ రాసిన ‘క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’ అనే పుస్తకాన్ని ఆదివారం ప్రజాభవన్లో భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే జన గణనలో అన్ని కులాల సామాజిక, విద్య, ఆర్థిక స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, దేశవ్యాప్తంగా సమగ్ర కుల జన గణన చేపట్టడానికి అది మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం బీసీ ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, మేధావులు, విద్యార్థుల జేఏసీ, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందంతో భట్టివిక్రమార్క సమావేశమయ్యారు.