త్వరలో మునిసిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:18 AM
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం ఇప్పటికే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, త్వరలో మునిసిపాలిటీల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని...
పట్టణ పేదలకూ మంజూరు చేస్తాం: భట్టి విక్రమార్క
మధిర, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం ఇప్పటికే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, త్వరలో మునిసిపాలిటీల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో శనివారం జరిగిన మునిసిపల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు, స్థలం లేని వారికి జిప్లస్2 తరహాలో ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తనతో పాటు సీఎం, యావత్ మంత్రివర్గం అహర్నిశలు కృషిచేస్తోందని తెలిపారు. మధిర అంటే తనకు ప్రాణమని, ఇక్కడి ప్రతి వ్యక్తీ తన కుటుంబ సభ్యుడేనని చెప్పారు. మధిర ప్రజలు తనకు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇవ్వడం వల్లే ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన ఆర్థికశాఖకు మంత్రిని అయ్యానన్నారు. మధిర అభివృద్ధికి మరో 50 ఏళ్లకు సరిపడేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.