kumaram bheem asifabad- ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:11 PM
ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిలువలు, రికార్డులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు
వాంకిడి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిలువలు, రికార్డులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయ పాలన పాటించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆసుపత్రికి సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డుల రూపంలో నమోదు చేయాలని సూచించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి అధికా రులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. మండల అభివృద్ధిలో భాగంగా ఈజీఎస్ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల ఏర్పాటు, జాబ్ కార్డులు, ఉపాధి హామి పనులకు సంబంధించిన కూలీల చెల్లింపులను సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని, ఎన్యుమరేషన్ ఫారాల అందజేత, తిరిగి సేకరణ, వివరాల నమోదు అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన జాబితా రూపొందించే దిశగా ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.