Share News

జనగణనలో బీసీ కులగణనను చేర్చాలి

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:07 AM

జనగణనలో బీసీ కులగణన అంశాన్ని చేర్చాలని, లేకపోతే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ హెచ్చరించారు.

జనగణనలో బీసీ కులగణనను చేర్చాలి

  • లేకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటాం

  • ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడితో అగ్గిరాజేస్తాం: జాజుల

గన్‌పార్క్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జనగణనలో బీసీ కులగణన అంశాన్ని చేర్చాలని, లేకపోతే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ హెచ్చరించారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడితో అగ్గిరాజేసి దిగ్బంధిస్తామన్నారు. బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్‌ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జనగణపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో జాజుల మాట్లాడారు. తెలంగాణలో కులగణన చేసిన తరహాలో కేంద్రం కూడా కులగణనతోపాటు జనగణన చేయాలన్నారు. జనగణనలో ఎస్సీ, ఎస్టీలకు కులం అంశాన్ని చేర్చినప్పుడు బీసీ కులాన్ని ఎందు కు చేర్చలేదని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ బీసీ సామాజిక వర్గానికి చెంది కూడా నోరు మెదపడం లేదని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మొదటి నుంచి బీసీల వ్యతిరేకిగా వ్యవహరిస్తురని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ జేఏసీ అధ్యక్షుడు కేశాన శంకర్‌రావు, బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్‌ ఛైర్మన్‌ గుజ్జ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 07:07 AM