బంజారా ప్రముఖులతో కవిత భేటీ
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:42 AM
బంజారా సమాజం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీనాయక్తోపాటు పలువురు బంజారా ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సమాలోచన
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): బంజారా సమాజం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీనాయక్తోపాటు పలువురు బంజారా ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్లో డీటీ నాయక్ నివాసంలో ఆమె బంజారా ప్రముఖులను కలిశారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ మంత్రివర్గంలో బంజారాలకు ప్రాతినిధ్యం లేదని.. ఈ కాంగ్రెస్ సర్కారు మంత్రివర్గంలోనూ బంజారాలకు స్థానం కల్పించలేదని మండిపడ్డారు. తాము స్థాపించే కొత్త పార్టీలో బంజారా సమాజానికి సముచిత గౌరవం, రాజకీయ అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. కొత్త పార్టీ విధివిధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు తమ అమూల్యమైన సలహాలు అందించాలని కోరారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించే బంజారా యువతకు తమ పార్టీ సాదర స్వాగతం పలుకుతుందన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ లక్ష్మణ్ నాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మోహన్సింగ్ నాయక్, హరినాయక్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ భీమ్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.