అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:52 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.
కరీంనగర్ మేయర్, కార్పొరేటర్లతో కలిసి పూజలు
మల్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి సంజయ్ పండ్లు అందజేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో అంజనారెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కరీంనగర్ మేయ ర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడంతో సంజయ్ ఈ నెల 14న కొండగట్టుకు అంజన్న ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఆయన కొండగట్టుకు చేరుకొనే సరికి రాత్రి 10 గంటలు దాటడంతో ఆలయాన్ని మూసివేశారు. దీంతో ఉగాది తరువాత అంజన్నను దర్శించుకుంటానని మొక్కుకున్నారు. దీంతో శనివారం ఆయన కరీంనగర్ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.