కల్తీ పాలు తాగడంతో.. అనారోగ్యం పాలయ్యా
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:32 AM
రసాయన ఎరువులతో పండిన పంటలను ఆరగించడమంటే డబ్బులిచ్చి రోగాలను ఆహ్వానించడమే అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
రైతులు రసాయన ఎరువులను వీడాలి
సేంద్రియ సాగుతో కోటీశ్వరులు కావచ్చు: సంజయ్
జమ్మికుంట, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): రసాయన ఎరువులతో పండిన పంటలను ఆరగించడమంటే డబ్బులిచ్చి రోగాలను ఆహ్వానించడమే అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లుగా తనకు కనీసం దగ్గు, జ్వరమైనా రాలేదని.. కానీ హైదరాబాద్లో కల్తీ పాలు తాగడం వల్ల ఐదు రోజులు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆయన వివరించారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో నిర్వహించిన ‘ప్రకృతి వ్యవసాయంపై రైతు సమ్మేళనం’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువులను దూరం పెట్టి ప్రకృతి సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ సాగుకి ఆదరణ పెరుగుతుండడం వల్ల రైతులు కోటీశ్వరులు కావచ్చన్నారు. ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 6,018 మంది రైతులతో 19గ్రామాల పరిధిలో 10వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న జమ్మికుంట కేవీకే నిర్వాహకులను అభినందించారు.