న్యాయ వ్యవస్థపై గౌరవంతో..నా కుమారుడిని పోలీసులకు అప్పగించా
ABN , Publish Date - May 17 , 2026 | 06:06 AM
చట్టం, న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో తన కుమారుడు బండి భగీరథ్ను న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ...
బెయిల్ వస్తుందని న్యాయవాదులు ఇప్పటికీ చెబుతున్నారు
కానీ ఇంకా జాప్యం సరికాదనే విచారణకు పంపాం: బండి సంజయ్
హైదరాబాద్, మే 16(ఆంధ్రజ్యోతి): చట్టం, న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవంతో తన కుమారుడు బండి భగీరథ్ను న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం ఓ ప్రకటన చేశారు. బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ‘చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే అని నేను ఇంతకుముందే చెప్పాను. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్లో అప్పగిద్దామనుకున్నా. న్యాయవాదులను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని వారు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. బెయిల్ వస్తుందని న్యాయవాదులు ఇప్పటికీ చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయవ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను. సత్యమేవ జయతే...’ అని సంజయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.