Share News

దమ్ముంటే అడ్డుకోండి

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:09 AM

హైదరాబాద్‌, పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలతో త్వరలో వందేమాతరం గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు.

దమ్ముంటే అడ్డుకోండి

  • భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద లక్షల మందితో వందేమాతరం పాడిస్తా

  • ఎంఐఎం, కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సవాల్‌

  • సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్‌ సిద్ధాంతం: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలతో త్వరలో వందేమాతరం గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. ఎంఐఎం, కాంగ్రెస్‌కు దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్‌ చేశారు. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్‌ రెండు కళ్ల సిద్ధాంతం అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌, కె.లక్ష్మణ్‌ వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. రేషన్‌ కార్డుల ద్వారా బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వమే నిధులు, బియ్యం ఇస్తుంటే స్మార్ట్‌ రేషన్‌కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని బండి సంజయ్‌ నిలదీశారు. కేంద్రం నిధులు వద్దు అనుకుంటే ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 22ఏ నిషేధిత జాబితా పేరుతో మహాదోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఇక, జెన్‌జీ పట్ల ప్రేమ ఉంటే తక్షణమే 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఆ స్థానాల్లో జెన్‌జీని నిలబెట్టి గెలిపించి వాళ్లను మంత్రులను చేయాలని బండి సంజయ్‌ కాంగ్రెస్‌కు సూచన చేశారు. కాగా, ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ కాస్తా యాంటీ ఇండియా కాంగ్రెస్‌ కమిటీగా మారిపోయిందని లక్ష్మణ్‌ ఆరోపించారు. పార్లమెంట్‌ ఆవరణలో సాధువులు, సన్యాసుల వేషాలు వేసి సనాతన ధర్మాన్ని కించపరిచారని లక్ష్మణ్‌ మండిపడ్డారు.


తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి ‘రెండు కళ్ల సిద్థాంతం’ పేరుతో సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారని, ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన 4 శాతం మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని రేవంత్‌ రెడ్డి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ దౌత్యంపై కనీస అవగాహన లేని రాహుల్‌ గాంధీ.. రాజకీయాల్లో జోకర్‌ పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దేశవ్యాప్తంగా 800 పైగా ఎంపీ స్థానాలను, తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలను రాజ్యాంగబద్ధంగా పెంచుతామని లక్ష్మణ్‌ వివరించారు.


బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌, బీజేపీ కర్ణాటక-తమిళనాడు కో-ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 06:10 AM