రెండున్నరేళ్లుగా ప్రకటనలు తప్ప పనుల్లేవ్
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:09 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో పెద్ద ప్రకటనలు తప్ప పనులు మాత్రం సాగడం లేదని బీజేపీ సీనియర్ నేత, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు.
నీటి కోసం ఉత్తర తెలంగాణ రైతుల ఇక్కట్లు
హరియాణా మాజీ గవర్నర్ దత్తాత్రేయ
యాదాద్రి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో పెద్ద ప్రకటనలు తప్ప పనులు మాత్రం సాగడం లేదని బీజేపీ సీనియర్ నేత, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఘటనలో అవినీతి, అక్రమాలకు బాధ్యులను శిక్షించాలని, రూ.లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును వృథాగా ఉంచితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలన్నారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సురక్షిత తాగునీరు అందించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.