Share News

సర్‌లో తొలగిస్తున్న ఓట్లలో మైనారిటీలవే అధికం

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:28 AM

ఓటరు జాబితా పరిశీలనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా తొలగిస్తున్న ఓట్లలో మైనార్టీల ఓట్లే అధికంగా ఉంటున్నాయని..

సర్‌లో తొలగిస్తున్న ఓట్లలో మైనారిటీలవే అధికం

  • ఈ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

  • ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్‌

  • ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వినతుల స్వీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా పరిశీలనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా తొలగిస్తున్న ఓట్లలో మైనార్టీల ఓట్లే అధికంగా ఉంటున్నాయని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ పేర్కొన్నారు. బిహార్‌, బెంగాల్‌లలో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌లలో ఇదే జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో అర్హత గల వారి ఓట్లు పోకుండా తామూ చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాంధీభవన్‌లో బుధవారం పునః ప్రారంభమైన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్‌ పాల్గొన్నారు. వివిధ సమస్యలకు సంబంధించి ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో 200కు పైగా దరఖాస్తులు, వినతిపత్రాలు వచ్చాయని చెప్పారు. తనకు సమర్పించిన వాటిలో 50కి పైగా పిటిషన్లను కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించానని తెలిపారు. ఎక్కువ శాతం హత్యలు, కుటుంబ సమస్యలకు సంబంధించిన పిటిషన్లే వచ్చాయని వెల్లడించారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే గురుకులాల్లో టెండర్లపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 05:29 AM