సంస్థాగత ప్రతిభకు ప్రసిద్ధి అసోం రైఫిల్స్
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:23 AM
సంస్థాగత ప్రతిభకు అసోం రైఫిల్స్ శిక్షణ కేంద్రం ప్రసిద్ధి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): సంస్థాగత ప్రతిభకు అసోం రైఫిల్స్ శిక్షణ కేంద్రం ప్రసిద్ధి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తమ సైనికులను తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. క్రమశిక్షణతో పాటు సమర్థులైన సైనికులను ఈ కేంద్రం దేశానికి అందిస్తోందని చెప్పారు. శనివారం నాగాలాండ్లోని దిమాపుర రీజియన్ సుఖోవిలోని అసోం రైఫిల్స్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న సైనికుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోం రైఫిల్స్ సైనికుల వీరత్వం, త్యాగం గుర్తు చేసేలా ఏర్పాటు చేసిన ‘శౌర్యస్థల్’ను ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 762 మంది సైనికులు పరేడ్ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. తమ దళ గౌరవాన్ని నిలబెట్టడం ప్రతీ సైనికుడి విధి అని అన్నారు. తాము చేసిన ప్రమాణాన్ని గుర్తుపెట్టుకుంటూ భరతమాత సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.