ముస్లింల వద్ద కొనొద్దన్న వారు..చమురు ఎందుకు కొంటున్నారు
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:20 AM
మహారాష్ట్రలో ముస్లింలు తయారు చేసే ఏ వస్తువునూ కొనుగోలు చేయవద్దని తీర్మానం చేసిన వారు అరబ్ దేశాల నుంచి క్రూడ్ అయిల్, డీజిల్, పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారని హైదరాబాద్ ఎంపీ....
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
చార్మినార్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో ముస్లింలు తయారు చేసే ఏ వస్తువునూ కొనుగోలు చేయవద్దని తీర్మానం చేసిన వారు అరబ్ దేశాల నుంచి క్రూడ్ అయిల్, డీజిల్, పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్లోని మక్కా మసీద్లో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘జల్సే యూముల్ ఖురాన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని గంగానదిలో ముస్లిం యువకులు పడవలో ఇఫ్తార్ విందు చేస్తే గంగానదిని అపవిత్రం చేశారంటూ వారిపై కేసులు నమోదు చేశారని, ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో రంజాన్ పండుగ జరుపుకోకుండా అడ్డుకుంటే స్థానికులు ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారని తెలిపారు. గుజరాత్లో ముస్లింలు ఇతర మతస్తుల నుంచి ఆస్తులు కొనుగోలు చేయకుండా చట్టం చేశారన్నారు. ప్రధాని విదేశాలకు వెళ్లి భారత్లో అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నామని ప్రకటిస్తూ ముస్లింలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శించారు.
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖండించలేదన్నారు. 1948 నుంచి పాలస్తీనాకు భారత్ మద్దతు ఇస్తోందని.. ప్రధాని మోదీ అవన్నీ పక్కన పెట్టి ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం ఉత్పతుల కొరత ఉన్నా ఎటువంటి కొరత లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు.