పరిశోధనా వేదికలు సృష్టించండి
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:27 AM
శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరం థెరపీ విప్లవంలో భారతదేశాన్ని అగ్రగామిగా ..
భవిష్యత్ తరం థెరపీ విప్లవంలో మనమే టాప్లో ఉండాలి
జేఎన్టీయూ స్నాతకోత్సవంలో అరబిందో డైరెక్టర్ మదన్మోహన్రెడ్డి
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరం థెరపీ విప్లవంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని ఫార్మసీ విద్యార్థులకు, ఆ రంగంలోని నిపుణులకు అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ మెట్టు మదన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని వర్సిటీ ఆయనకు శనివారం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా స్నాతకోత్సవ సభలో మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. శాస్ర్తీయ పరిశోధనలను వేగవంతం చేసే వేదికలను, ఆవిష్కరణల ఇంక్యుబేటర్లను సృష్టించాలని సూచించారు. వీటిద్వారా పరిశ్రమ - విద్యా భాగస్వామ్యాలను మరింతగా పెంచవచ్చని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్.. తదితర డిమాండ్ ఉన్న రంగాలకు అనుగుణంగా ఆర్ 25 కరిక్యులంను రూపొందించి, ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నామని జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ కిషన్కుమార్రెడ్డి తెలిపారు.