Water Dispute: తెలంగాణకు ఇచ్చిన అనుమతుల వివరాలివ్వండి
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:30 AM
గోదావరిలో తెలంగాణకు ప్రాజెక్టుల వారీగా 940.87 టీఎంసీల జలాలను వినియోగించుకోవడానికి కేంద్ర జల వనరుల కమిషన్..
గోదావరి బోర్డుకు ఏపీ లేఖ
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : గోదావరిలో తెలంగాణకు ప్రాజెక్టుల వారీగా 940.87 టీఎంసీల జలాలను వినియోగించుకోవడానికి కేంద్ర జల వనరుల కమిషన్(సీడబ్ల్యూసీ)లోని వివిధ డైరెక్టరేట్లతో పాటు టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) ఇచ్చిన అనుమతులకి సంబంధించిన పత్రాలు అందజేయాలని గోదావరి నది యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)ను ఏపీ ప్రభుత్వం కోరింది. దాంతో ఆయా పత్రాలను ఈ నెల 30వ తేదీన జరిగే కేంద్ర కమిటీ సమావేశంలో ఆయా విభాగాల నుంచే నేరుగా తీసుకోవాలని గోదావరి బోర్డు బదులిచ్చింది. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలపై ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించిన అత్యున్నత స్థాయి పరిపాలన, సాంకేతిక విభాగాల అధికారులతో పాటు సీడబ్ల్యూసీలో ప్రాజెక్టుల ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్ఫఆర్), డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు(డీపీఆర్)లను మదింపు జరిపే అధికారులూ ఉన్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఏయే పత్రాలు, ఏయే సమాచారం కావాలో నేరుగా కమిటీకి విజ్ఞప్తి చేయాలని గోదావరి బోర్డు ఏపీకి సూచించింది. ఈమేరకు ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీ(ఇరిగేషన్)కి గత శుక్రవారం గోదావరి బోర్డు లేఖ రాసింది.