ములుగు కొండల్లో అపురూప రాతి చిత్రాలు!
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:54 AM
తెలంగాణ చరిత్రలోనే మరో అపురూపమైన చారిత్రక సంపద వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నారాయణపురం అటవీ ప్రాంతంలో..
మొద్దుగుట్ట, నెమలిగుట్ట, దర్వాజ గుట్టల్లో ఆదిమానవుల ఆవాసాలు
వెంకటాపూర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ చరిత్రలోనే మరో అపురూపమైన చారిత్రక సంపద వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నారాయణపురం అటవీ ప్రాంతంలో ఉన్న బండ్లపహాడ్ రెవెన్యూ గ్రామ పరిధిలోని దట్టమైన కొండల్లో ఆదిమానవుల జీవన విధానానికి అద్దంపట్టే 10 వేల ఏళ్లనాటి ప్రాచీన రాతి చిత్రాలు బయటపడ్డాయి. ‘పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రీహ) పరిశోధకులు వాటిని గుర్తించారు. ఈ ప్రాంతాలు ఒకప్పుడు ఆదిమానవుల ప్రధాన ఆవాసాలుగా విలసిల్ల్లాయని ఇక్కడి ఆధారాలు నిరూపిస్తున్నాయి. గుహల్లో వేసిన రాతి వర్ణపు చిత్రాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. కేవలం గీతలే కాకుండా రకరకాల అలంకారాలతో కూడిన మానవ ఆకృతులు ఆ రాతి గోడలపై దర్శనమిస్తున్నాయి. గుహల్లో లభించిన కొన్ని ప్రాచీన చిత్రాలు ప్రస్తుత ఉపగ్రహ నమూనాలను పోలి ఉండటం పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నెమలి గుట్టల్లో రాతియుగం నాటి బృహత్ శిలా యుగపు సమాధులు బయటపడ్డాయి.